వాషింగ్టన్ : దాదాపు మూడేండ్ల నుంచి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడబోతున్నదా? అంటే, ‘ఔను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినట్టు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా తమ బృందాలు వెంటనే చర్చలు ప్రారంభించేందుకు ఇద్దరమూ అంగీకరించామని ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య సంభాషణను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలపడం ద్వారా చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. చర్చలకు నేతృత్వం వహించే బాధ్యతను ఆయన పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు. కాగా, దాదాపు గంటన్నర పాటు ట్రంప్, పుతిన్ ఫోన్ మాట్లాడుకున్నారని, ట్రంప్ను మాస్కోలో పర్యటించాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారని రష్యా వర్గాలు తెలిపాయి.
రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధమని అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతంలోని భూభాగానికి బదులుగా తాము ఆక్రమించుకున్న రష్యా ప్రాంతానికి చెందిన కుర్స్స్ని అప్పగించేందుకు సిద్ధమని ఆయన ప్రతిపాదించారు. అయితే చర్చలకు ఇరు దేశాలను తీసుకువచ్చే కీలక పాత్రను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు షరతు విధించారు. దాదాపు మూడేళ్లుగా రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భూభాగాల బదిలీ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నది. అనంతరం 2022లో డొనెట్స్, ఖేర్సన్, లుహాన్స్, జపోరిజియా భూభాగాలతోసహా మరికొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నది.