లండన్: ఒక వ్యక్తి మరణించిన తల్లి మాదిరిగా ఆడ గొంతుతో (dead mother’s voice) బ్యాంకుకు ఫోన్ కాల్స్ చేశాడు. తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.60 లక్షలు (56,000 పౌండ్లు) లూఠీ చేశాడు. తండ్రి దాచుకున్న డబ్బులన్నీ కొల్లగొట్టాడు. తండ్రి ఇంటిపై కూడా లోన్ తీసుకున్నాడు. చివరకు ఆ ఇంటి స్వాధీనం కోసం నోటీస్ అందడంతో కుమారుడి మోసాలు బయటపడ్డాయి. విస్తూపోయే ఈ సంఘటన బ్రిటన్లో జరిగింది. 42 ఏళ్ల డేనియల్ కట్బర్ట్ వృద్ధుడైన తండ్రిని మోసగించాడు. కొన్నేళ్ల కిందట అతడి తల్లి చనిపోయింది. అయితే మరణించిన తల్లి గొంతుతో తండ్రి ఖాతా ఉన్న బ్యాంకుకు పలుసార్లు ఫోన్ చేశాడు. బ్యాంకు సిబ్బంది అడిగిన సెక్యూరిటీ ప్రశ్నలకు సరైన సమాధాలను తల్లి మాట్లాడుతున్నట్లుగా చెప్పాడు. ఇలా పలు మోసాల ద్వారా 2017 నుంచి 2018 వరకు తండ్రి బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.60 లక్షలు తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తండ్రి జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ లూఠీ చేశాడు.
కాగా, డేనియల్ అంతటితో ఆగలేదు. తండ్రి పేరు మీద పలు అప్పులు చేశాడు. చివరకు తండ్రి ఇంటిపై కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. అయితే తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయం కావడాన్ని 2017లో తండ్రి గమనించాడు. దీనిపై కుమారుడ్ని నిలదీయగా తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. తాను ఏ తప్పు చేయలేదని తండ్రిని నమ్మించాడు.
మరోవైపు ఇంటి అప్పు బకాయిలు పెరిగిపోయాయి. దీంతో 2018లో బిల్డింగ్ సొసైటీ ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. అప్పుల వల్ల ఇంటిని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై ఆరా తీయగా కుమారుడు చేసిన మోసాలన్నీ బయటకు వచ్చాయి. దీంతో ఆ తండ్రి చివరకు కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి మాదిరిగా ఆడ గొంతుతో మాట్లాడిన కుమారుడి ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంకు సిబ్బందిని మోసగించిన వైనం బయటపడింది. ఈ నేరాలపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.