ఆ మరుసటిరోజునుంచి దేశవ్యాప్తంగా..
ఏడాదిగా మహమ్మారిపై సుదీర్ఘ పోరు
వైరస్తో దేశంలో 1,59,790 మంది మృతి
తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్19
మాస్క్, టీకానే పరిష్కారమన్న నిపుణులు
జనతా కర్ఫ్యూ విధించి నేటికి ఏడాది
ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసులు.. టపటప రాలిపోతున్న ప్రాణాలు! ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో.. కరోనా కట్టడికి కేంద్రం ఉపయోగించిన బ్రహ్మాస్త్రం..
లాక్డౌన్! సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జనతా కర్ఫ్యూతో మొదలై.. పూర్తి లాక్డౌన్ దిశగా ప్రయాణించిన సమయం!
వైరస్ సోకితే ప్రాణాలు పోతాయని వెంటాడిన భయం ఓవైపు, లాక్డౌన్తో ఉపాధి కరువై.. తినడానికే తిండిలేక లక్షల కుటుంబాలు పస్తులుండిన దైన్యం మరోవైపు! పట్నాల్లో ఉండలేక.. ఊరికిపోవడానికి రవాణా సదుపాయాల్లేక దేశం నలుమూలల నుంచి వేలమంది వలస కార్మికులు వందల కిలోమీటర్ల దూరం కాలి నడకనే బయల్దేరిన దుస్థితి! ప్రభుత్వ చర్యలకు తోడు.. ప్రజలు పాటించిన సంయమనం, కష్టాలు అనుభవించినా.. కరోనా విస్తరించకూడదన్న సంకల్పంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనిపించింది. కానీ ఊపిరి తీసుకునేలోపే మళ్లీ విజృంభిస్తున్నది! నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదని మరో మారు హెచ్చరికలు జారీచేస్తున్నది! బహుపరాక్!!
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. మన దేశంలో వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ఒక రోజు జనతా కర్ఫ్యూ విధించి సోమవారానికి సరిగ్గా ఏడాది. వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలియదు.. ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు.. మందులు, చికిత్స తెలియదు.. ప్రజలను కాపాడుకొనే మార్గం తెలియదు.. ఇలాంటి తరుణంలో ఉన్న ఏకైక మార్గం జనతా కర్ఫ్యూ.. లాక్డౌన్. కేంద్రం ఇవే అస్త్రాలను ప్రయోగించింది. విధానాలు రూపకల్పన చేసే వరకు, పక్కా ప్రణాళి రూపొందించే వరకు ప్రజలు మహమ్మారి బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో అందరి కంటే ముందే అప్రమత్తమయ్యారు. దేశంలో లాక్డౌన్ విధించే కంటే ఒక రోజు ముందే తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా, రాష్ట్రంలో మార్చి 23న లాక్డౌన్ విధించారు. ఒక రోజు తర్వాత 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైంది.
పెద్ద సంఖ్యలో పోయిన ప్రాణాలు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,99,130 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,59,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మన రాష్ట్రంలోనూ ఈ వైరస్కు తోడు దీర్ఘకాలిక వ్యాధులతో 1,669 మంది మృతిచెందారు. వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో చికిత్సా విధానం, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో అవగాహన లేకపోవడంతో ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. లాక్డౌన్తో వైరస్ వ్యాప్తికి కొంతవరకు అడ్డుకట్ట వేసిన కేంద్రం, ఆ సమయంలో అప్పటివరకు లేని వైద్య సామగ్రిని, సదుపాయాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలోని త్రిస్సూర్లో జనవరి 30న నమోదు కాగా, జూలై 30 నాటికి 54 వేల కేసులు నమోదయ్యాయి. ఈ వృద్ధి ఇలాగే కొనసాగి సెప్టెంబర్ 11న అత్యధికంగా 97,654 కేసులు రికార్డయ్యాయి. సెప్టెంబర్ 30 వరకు ఈ వృద్ధి కొనసాగింది. ఈ క్రమంలో తీసుకున్న చర్యలు, ప్రజలకు వైరస్ పట్ల అవగాహన పెరగడంతో మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న అత్యల్పంగా కేవలం 9,300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో పక్కా ప్రణాళిక
రాష్ట్రంలో వైరస్ కట్టడికి చర్యలు పకడ్బందీగా అమలయ్యేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వ్యాప్తికి అడ్డుకట్టవేశారు. వైరస్ బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా గాంధీ, ఆ తర్వాత టిమ్స్ దవాఖానలను సిద్ధంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ప్రత్యేకంగా కొవిడ్ వార్డులు ఏర్పాటుచేయడంతోపాటు ఆక్సిజన్ సౌకర్యాన్ని సమకూర్చారు. చికిత్సకు మందుల కొరత లేకుండా స్వయంగా ఫార్మా కంపెనీలతో మాట్లాడారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయడంతోపాటు పాజిటివ్గా నిర్ధారణ అయినవారికి కరోనా కిట్లను అందించారు. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకొనేవారి కోసం ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి అనునిత్యం వైద్యులు అండగా నిలిచారు. దీంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది.
ఇప్పుడు రెండోసారి విజృంభణ
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు 50 వేల సమీపానికి చేరుకోవడంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా ఈ రాష్ర్టాల్లోనే ఉన్నట్టు స్పష్టంచేసింది. దీంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేయడంతోపాటు, పాఠశాలలు, ఆఫీసులు, థియేటర్లలో పరిమితి వరకే అనుమతిస్తున్నారు. వీటిలో మన పక్క రాష్ర్టాలు కూడా ఉండటంతో రాకపోకలపై నిఘా వేయడంతోపాటు పరీక్షలు నిర్వహిస్తున్నది.
కరోనా వారియర్స్కు సలాం
ఈ ఏడాది కాలంలో పారిశుద్ధ్యం, మున్సిపాలిటీ, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యం.. ఇలా అనేక శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటికీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. జర్నలిస్టులు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎందరో కరోనా కష్టకాలంలో బాధ్యతలు నిర్వర్తించారు. వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వానికి సహకారం అందించారు. ఈ క్రమంలో అందరికంటే ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్య సిబ్బంది సేవలు అమూల్యం. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన కృషికి యావత్ ప్రపంచం సలాం చేసింది. కరోనా పోరులో ఎంతో మంది వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం 31 వేల మందికి వ్యాక్సిన్
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా 31,302 మంది తొలి డోస్ తీసుకున్నారు. 1,370 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలి డోస్ తీసుకున్నవారి సంఖ్య 71 వేలకు చేరగా, రెండో డోస్ తీసుకున్నవారి సంఖ్య 2.19 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా 0.75 శాతం మాత్రమే ఉన్నదని, దేశంలోనే ఇది అత్యల్పమని ఆదివారం వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
ఒక్కరోజే 394 కేసులు
రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం 64 వేల వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 394 మందికి పాజిటివ్గా తేలిందని ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి జిల్లాలో 64, మేడ్చల్ మల్కాజిగిరిలో 34, వరంగల్ అర్బన్లో 10 కేసులు రికార్డయ్యాయి. మరోవైపు విద్యార్థులపై కరోనా పంజా విసురుతున్నది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని పూలే హాస్టల్లో ఒక టీచర్తోపాటు 45 మంది విద్యార్థులకు ఆదివారం వైరస్ సోకింది. హైదరాబాద్ పాతబస్తీలోని రాజన్నబావి శివాజీనగర్లోని బీసీ బాలికల వసతి గృహంలో 9 మంది విద్యార్థినులకు కరోనా అంటుకున్నది. జూబ్లీహిల్స్ జవహర్కాలనీకి చెందిన బీహెచ్ఈఎల్ కాంట్రాక్ట్ రిటైర్డ్ ఉద్యోగికి కరోనా సోకడంతో గాంధీకి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మృతిచెందారు.
ఏపీలో 368 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం 31,138 మందిని పరీక్షించగా, 368 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు మహమ్మారి సోకిన వారిసంఖ్య 8,93,734 చేరింది. 7,189 మంది కొవిడ్తో మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,47,36,326 నమూనాలను పరీక్షించినట్టు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,083 యాక్టివ్ కేసుల్లో 490 కేసులు ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఉండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సరిహద్దు రాష్ర్టాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. 60 ఏండ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏండ్ల దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అందరికీ వ్యాక్సిన్ వచ్చినప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలం. అందుకే ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం తరఫున వైద్యారోగ్యశాఖ 24 గంటలు అప్రమత్తంగా ఉన్నది. ఏడాదిపాటు ఎంతో పోరాడి వైరస్ వ్యాప్తిని అదుపులో పెట్టుకున్నాం. దాన్ని కొనసాగించడం అందరి బాధ్యత.
దేశవ్యాప్తంగా కర్ఫ్యూ: మార్చి 22
రాష్ట్రంలో లాక్డౌన్: మార్చి 23
దేశవ్యాప్తంగా లాక్డౌన్
ఫేజ్ 1: 25 మార్చి – 14 ఏప్రిల్ (23 రోజులు)
ఫేజ్ 2: 15 ఏప్రిల్ – 3 మే (19 రోజులు)
ఫేజ్ 3: 4 మే – 17 మే (14 రోజులు)
ఫేజ్ 4: 18 మే – 31 మే (14 రోజులు)