తాలిబాన్ సర్కార్ మహిళల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ సారి ఈ ఆంక్షలు మహిళా జర్నలిస్టులకు వర్తించనున్నాయి. న్యూస్ ప్రజెంటర్స్ న్యూస్ చదువుతున్న సమయంలో తమ మొఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశించింది. ఆయా మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తూచ తప్పకుండా పాటించాలని తాలిబాన్ సర్కార్ హుకూం జారీ చేసింది.
మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ మొఖాలను కప్పుకోవాలంటూ తాలిబాన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రిందటే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇదే రకమైన ఆదేశాలను న్యూస్ ప్రజెంటర్స్కు కూడా చేసింది. దీంతో మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ ఆదేశాలను పాటించని క్రమంలో ఎలాంటి శిక్షలుంటాయో మాత్రం ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు.
ఈ విషయంపై తాలిబాన్ అధికార ప్రతినిధి అకిఫ్ మహజర్ స్పందించారు. న్యూస్ ప్రెజెంటర్స్ వార్తలు చదువుతున్న సమయంలో తమ మొహాలను కప్పుకోవాలన్న తమ ప్రతిపాదనకు మీడియా సంస్థల అధిపతులందరూ ఓకే చెప్పారని ఆయన వెల్లడించారు. మే 21 వరకూ అందరికీ వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.