న్యూఢిల్లీ: పొరుగు దేశం నేపాల్లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్లో సైతం ఈ భూకంప ప్రభావం కనిపించింది. ఇవాళ మధ్యాహ్నం 2.28 గంటలకు నేపాల్లో 5.4 తీవ్రతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఉన్నట్టుండి భూమి తీవ్రంగా కంపించిందని, భయంతో తాము ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశామని ఢిల్లీ వాసులు చెబుతున్నారు. భూప్రకంపనల సమయంలో ఇంట్లోని సామాగ్రి, ఫ్యాన్లు తదితర వస్తువులు ఊగిపోయిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ భూకంపంవల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, గత ఏడాది నవంబర్లో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం ధాటికి తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ భూకంప తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. ఉత్తరాన నేపాల్లో, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వరకు భూమి కంపించింది. కానీ, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.