పాకిస్తాన్ ప్రజలు కొన్ని రోజుల్లోనే ఎన్నికలకు వెళ్లనున్నారు. అవును.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్, దాని మిత్రపక్షాలు ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయట. ఈ విషయాన్ని పాక్ మీడియా పేర్కొంటోంది. దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, విదేశీ అప్పులు ఎక్కువైపోయాయని, ఈ నేపథ్యంలో ఇవన్నీ గత సర్కార్ చేసిన పాపాలని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంటోంది.
ఆర్థిక సంకటాలు, విదేశీ అప్పులు పెరిగిపోవడం.. ఇవన్నీ తమ మెడకు చుట్టుకునే ఛాన్స్ వుందని, ఆ పాపాలు తమ మెడకు చుట్టుకోకుండా వుండాలంటే, ముందస్తే శరణ్యమని ప్రధాని, మిత్రపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి. ప్రధాని షెహబాజ్ పాకిస్తాన్ ముస్లింలీగ్ మిత్రపక్షాలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. మిత్రపక్షాలందరూ ముందస్తుకే తల ఊపినట్లు సమాచారం.
ఈ సమావేశానికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, జమాత్ ఉలేమా ఎ ఇస్లామ్ అధ్యక్షుడు మౌలానా ఫజల్ ఉర్ రహ్మాన్, ఎంక్యూఎం అధ్యక్షుడు ఖాలిదా మఖ్బుల్ సిద్దిఖీ తదితరులు హాజరయ్యారు. అధిక ధరలు, ఆర్థిక సంకటాలు.. పెట్రో ధరల పెంపు.. ఈ విషయాల చుట్టే ఈ సమావేశం తిరిగిందని పాక్ పత్రికలు పేర్కొంటున్నాయి.