Mosque Blast | పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అనుమానిత సూసైడ్ బాంబర్ తలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య 93కి పెరిగింది. 221 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం కొంత భాగం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్లను మాత్రమే అనుమతిస్తున్నారు.