కీవ్: రష్యా కొత్త తరహా అటాక్ ప్రారంభించింది. ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలను తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. దాడులు మొదలై 13 రోజులు గడిచిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలపై బాంబు వర్షం ప్రారంభించింది. పశ్చిమ ప్రాంతంలోని లుస్క్, ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరాలపై మిసైల్ దాడులు జరిగాయి. ఇవాళ ఉదయం ఆ అటాక్ జరిగినట్లు ఉక్రెయిన్ కూడా ద్రువీకరించింది. వైమానిక కేంద్రాలను మిస్సైళ్ల ద్వారా టార్గెట్ చేశారు. ఈ రెండు నగరాలతో పాటు డిప్రో ప్రాంతంపై కూడా మిస్సైళ్ల దాడి జరిగింది. యుద్ధం ప్రారంభించిన రెండు వారాల తర్వాత తొలిసారి ఆ ప్రాంతాల్లో బాంబు దాడి జరిగింది. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలకు కొందరు వెళ్తున్నారు. అక్కడి ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయన్న భావనతో ప్రజలు అటు వలస వెళ్తున్నారు. లివివ్ నగరం నుంచి వేలాది మంది ఆ ప్రాంతాల వైపు వెళ్లారు.
లుస్క్, ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరాలపై జరిగిన దాడులను రష్యా రక్షణ కార్యాలయం ద్రువీకరించింది. పశ్చిమ ఉక్రెయిన్లో ఉన్న రెండు నగరాల్లోని సైనిక స్థావరాలపై చాలా కచ్చితత్వంతో దాడి చేసినట్లు రష్యా రక్షణ అధికారులు తెలిపారు. అయితే లుస్క్, ఇవానో నగరాల్లో భారీ స్థాయిల్లో పేలుళ్లు, ఫైరింగ్ శబ్ధాలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.