లండన్, అక్టోబర్ 23: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి రేసులో తాను ప్రధాన పోటీదారునని భారత సంతతి వ్యక్తి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ ప్రకటించారు. ప్రధాని పదవికి లిజ్ ట్రస్ అనూహ్య రాజీనామాతో కొత్త ప్రధానిని ఎన్నుకొనే ప్రక్రియ ప్రారంభం కావటంతో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ను రిషి ఈసారి నేరుగా ఢీకొట్టనున్నారు. నాలుగు నెలల క్రితం వరకు బోరిస్ ప్రధానిగా, ఆయన మంత్రివర్గంలో రిషి ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. బోరిస్ రాజీనామా తర్వాత ప్రధాని పదవికి లిజ్ ట్రస్తో తుదకంటా పోరాడి రిషి ఓడిపోయారు. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడలేకపోయిన లిజ్ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేయటంతో ఇప్పుడు బోరిస్, రిషి ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.