లాహోర్: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. వివిధ నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పెట్రోల్ పంపులు ఖాళీ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని లాహోర్, గుజ్రన్వాలా, ఫైసలాబాద్ తదితర పెద్ద, చిన్న నగరాల్లో ఖాళీ పెట్రోల్ పంపులు దర్శనమిస్తున్నాయి.
దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇంధన సరఫరా సరిగాలేక రోజురోజుకు మూతపడుతున్న పెట్రోల్ పంపుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. ఇంధనం అందుబాటులో ఉన్న పెట్రోల్ పంపుల్లో వాహనదారులు కార్లు, బైకులతో భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుంది. లాహోర్లో మొత్తం 450 పెట్రోల్ పంపులు ఉండగా.. వాటిలో ఇప్పటికే 70 పంపులు మూతపడ్డాయి.
కాగా, పాకిస్థాన్లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కావాల్సినంత ఇంధనాన్ని సరఫరా చేయడంలో విఫలమయ్యాయని పెట్రోల్ డీలర్లు ఆరోపిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఇంధన నిల్వలను హోల్డ్ చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. అయితే, పెట్రోల్ డీలర్ల ఆరోపణలను పాకిస్థాన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తోసిపుచ్చుతున్నాయి.