Nepal plane crash: నేపాల్లో విమానం కుప్పకూలిన ఘటనను ఆ ఏరియాకు చెందిన పలువురు ప్రత్యక్షంగా చూశారు. అలా చూసిన వారిలో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉన్న గృహిణులు, వీధుల్లో మాట్లాడుకుంటున్న యువకులు, ఆటలాడుకుంటున్న పిల్లలు ఉన్నారు. నేపాల్కు చెందిన ఖాట్మండు పోస్ట్ పత్రిక ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన అందరి నుంచి వివరాలు సేకరించి ఇవాళ్టి ఎడిషన్లో ప్రచురించింది. అందరి ఫీలింగ్స్ను తన ప్రత్యేక కథనంలో వివరంగా రాసుకొచ్చింది. మరి ఆ వివరాలేమిటో మనం కూడా తెలుసుకుందామా..?
కల్పనా సునార్ అనే గృహిణి ప్రమాదం జరిగినప్పుడు తన ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్నది. ‘నేనప్పుడు మా ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్నా. నాకు తక్కువ ఎత్తులో విమానం శబ్దం వినపడింది. దాంతో తల పైకెత్తి చూసేసరికి విమానం అదుపుతప్పి వంకరటింకరగా కిందకు దూసుకొస్తున్నది. అది నావైపే దూసుకొస్తున్నట్లుగా కనిపించింది. ఇంతలోనే తన ఇంటికి సమీపంలో ఉన్న సేథీ నది లోయలో కుప్పకూలింది. అప్పుడు భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే లోయలో నుంచి దట్టమైన నల్లటి పొగపైకి వచ్చింది. కాసేపటికే ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి’ అని కల్పనా సునార్ చెప్పింది.
మా ఇంటి సమీపంలో విమానం విరిగిన రెక్క పడింది..
‘భారీ పేలుడు శబ్దం వినపడగానే నేను ఇంట్లోంచి బయటికి పరుగున వచ్చి చూశా. అప్పుడు విమానం రెక్కల్లో ఒకటి మా ఇంటికి సమీపంలో పడటం గమనించా. మా ఇంటికి కేవలం 12 మీటర్ల దూరంలో ఆ విరిగిన విమానం రెక్క పడింది. మా ఇంటికి కూతవేటు దూరంలోనే విమానం కూలింది. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఉంటే మా ఇండ్లపై పడేది. అప్పుడు విమానంలో ఉన్న వారితోపాటు మా గ్రామానికి చెందిన వాళ్లు కూడా చాలామంది మరణించేవారు’ అని మరో ప్రత్యక్ష సాక్షి, స్థానిక గృహిణి గీతా సునార్ తెలిపింది.
విమానంలోంచి అరుపులు, గట్టిగా ఏడుపులు వినిపించాయి..
‘మేం అప్పుడు ఊరి బయట ఆడుకుంటున్నాం. మాకు చాలా దూరం నుంచి ఒక ఆకారం దూసుకొస్తూ కనిపించింది. ముందుగా మేం అది విమానం బొమ్మ అనుకున్నాం. అది కొంత దగ్గరికి వచ్చేసరికి విమానం శబ్దం వినపడింది. అంతలోనే విమానంలోంచి అరుపులు, కేకలు, గట్టిగా ఏడుపులు వినిపించాయి. దాంతో మేం భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తున్నాం. అదేసమయంలో విమానం మమ్మల్ని దాటేసి వెళ్లింది. విమానం టైర్లు మా తలలను టచ్ చేస్తూ పోయినట్లుగా అనిపించింది. కాసేపటికే భారీ శబ్ధంతో విమానం కూలిపోయింది. ఆ వెంటనే దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి’ అని సమీర్, ప్రజ్వల్ అనే 11, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు చెప్పారు.
తలుచుకుంటేనే భయంకరంగా అనిపిస్తున్నది..
నేను బయట స్నేహితులతో మాట్లాడుకుంటూ నిలబడి ఉన్నా. అప్పుడే ఎయిర్క్రాఫ్ట్ కిందకు దూసుకొచ్చి సేథి నది లోయలో కుప్పకూలింది. వెంటనే మేం అటుగా పరుగుతీశాం. అప్పటికి విమానం ముందు భాగం మాత్రమే మంటల్లో కాలిపోతున్నది. వెనుక భాగంలోని ఏడెనిమిది కిటికీల వరకు మంటలే లేవు. కానీ మేం చూస్తుండగానే క్షణాల్లో విమానం వెనుక భాగం కూడా కాలిపోయింది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే భయంకరంగా అనిపిస్తున్నది. విమానం ఇంక కొంచెం ముందుకు వచ్చి ఉంటే ఇండ్లపై పడేది. అప్పుడు ప్రాణ నష్టం భారీగా ఉండేది అని బైన్షా బహదూర్ అనే మరో ప్రత్యక్షసాక్షి వెల్లడించాడు.
ఇంకో నలుగురి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఆదివారం ఉదయం ఫొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడానికి కొన్ని క్షణాల ముందు 72 మందితో వచ్చిన యతి ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. ఆ వెంటనే విమానంలోంచి దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ రక్షణ చర్యలు చేపట్టగా.. ఆదివారం సాయంత్రానికి 68 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా గత రాత్రి రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేశారు. ఇవాళ ఉదయం గల్లంతైన మిగతా నలుగురి జాగ కోసం రక్షణ చర్యలను పునరుద్ధరించారు.