ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఎమర్జెన్సీ ప్రకటించేందుకు స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు, చిన్నారుల పట్ల అత్యాచార కేసులు పెరగడం వల్ల అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ హోంశాఖ మంత్రి అత్తా త్రార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పెరగడం.. సమాజానికి, ప్రభుత్వ అధికారులకు ఇదో సీరియస్ అంశమవుతుందన్నారు. పంజాబ్ ప్రావిన్సులో ప్రతి రోజు నాలుగైడు రేప్ కేసులు నమోదు అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి కేసులను డీల్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. లైంగిక వేధింపుల కేసుల్ని ప్రత్యేకంగా పరిష్కరించాలన్నారు. రేప్ కేసులను డీల్ చేసేందుకు తమ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. మహిళా హక్కుల సంఘాలు, టీచర్లు, అటార్నీలను సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతామన్నారు. పిల్లలకు భద్రత గురించి నేర్పాలని ఆయన తల్లితండ్రులను కోరారు.
చాలా వరకు అత్యాచార కేసుల్లో నిందితుల్లో అరెస్టు చేశామని, యాంటీ రేప్ క్యాంపేన్ను మొదలుపెట్టామని, వేధింపుల గురించి స్టూడెంట్స్కు వార్నింగ్ ఇచ్చినట్లు మంత్రి త్రార్ తెలిపారు. జెండర్ గ్యాప్ ఇండెక్స్లో పాకిస్థాన్ 153వ స్థానంలో ఉంది.