ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారశాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా అంశాలను ఎన్ఎస్సీ కోఆర్డినేట్ చేస్తున్నది. ప్రధాని ఇమ్రాన్తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. ఇంటెలిజెన్స్తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు.
ప్రధాని పదవి నుంచి తనను తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతున్నట్లు ఇమ్రాన్ ఆరోపించారు. నిన్న జరిగిన సమావేశానికి ఎంక్యూఎం-పీ, బీఏపీ పార్టీలు హాజరుకాలేదు. విదేశీ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఇమ్రాన్ మీడియాతోనూ పంచుకున్నారు. కొందరు టీవీ యాంకర్లను కూడా ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే రహస్య లేఖను మాత్రం ఇమ్రాన్ ఎవరికీ చూపించలేదు. మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ జాతీయ అసెంబ్లీలో 4 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్నది. ఏప్రిల్ 3వ తేదీన ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఆ ప్రసంగం ఎప్పుడు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేదు.