పాక్లో ప్రభుత్వం ఎంత పవర్ ఫుల్లో… ఆర్మీ కూడా అంతే పవర్ ఫుల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వాధినేతల జాతకం అంతా ఆర్మీ చీఫ్ చేతుల్లోనే వుంటుందన్న వాదన కూడా ఒకటి ప్రబలంగానే వుంది. తాజాగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయ్ అన్న వార్తలొస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం ముంగిట ఇమ్రాన్ సర్కార్ నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్కు అల్టిమేటం జారీ చేశారన్న వార్తలు వస్తున్నాయి.
‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కోఆపరేషన్’ సమావేశాల తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ చీఫ్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్ను కోరినట్లు పాక్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాతో సహా మరో ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారని, ఈ సమావేశంలోనే వీరు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పీఠంపై ఇమ్రాన్ను కొనసాగించే పరిస్థితులను సజీవంగా ఉంచరాదని వీరు నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి పాక్ ఆర్మీ మాజీ చీఫ్ రహీల్ షరీఫ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ బాజ్వాతో భేటీ కావాల్సి ఉంది. రహీల్ షరీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దగ్గరి వ్యక్తి. ఆర్మీ మాజీ చీఫ్, ప్రస్తుత చీఫ్ బాజ్వా మధ్య సమావేశం జరిగితే ఇమ్రాన్ ప్రభుత్వం సేఫ్ అని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. వీరిద్దరి భేటీ జరగలేదు. దీంతో సాక్షాత్తూ ప్రధాని ఇమ్రానే రెండు రోజుల క్రితం ఆర్మీ చీఫ్ బాజ్వాతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయి. అవిశ్వాస తీర్మానం, ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాల గురించే వీరిద్దరూ చర్చించుకున్నారు. అయితే తన ప్రభుత్వ మనుగడ గురించి ప్రధాని ఇమ్రాన్ ఆర్మీ చీఫ్తో ఏమైనా మాట్లాడారా? లేదా? అన్నది మాత్రం బయటకు రాలేదు.