ట్రిపోలి: సాయుధ దళాల అంతర్గత తిరుగుబాటుతో అట్టుడుకుతున్న లిబియాను (Libya) ఆకస్మిక వరదలు ముంచెత్తాయి (Massiv Floods). ప్రకృతి ప్రకోపానికి 2 వేల మందికిపైగా చనిపోగా, వేల సంఖ్యలో గల్లంతయారు. తూర్పు లిబియాలోని డెర్నా (Derna) నగరంలో తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో సుమారు 2 వేల మంది మరణించారని, 5 నుంచి 6 వేల మంది వరదల్లో గల్లంతయ్యారని ఆ దేశ ప్రధాని ఒసామా హమద్ (Osama Hamad) తెలిపారు. వరదల తాకిడికి ఎగువన ఉన్న డ్యామ్లన్నీ నిండి ఉప్పొంగడంతో డెర్నాను ముంచెత్తాయని, దీంతో నగరం పూర్తిగా ధ్వంసమయిందని తెలిపారు. ఎత్తయిన భవనాలు కూడా నేలమట్టమయ్యాయని వెల్లడించారు.
డేనియల్ తుఫాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్దర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని రక్షించడానికి సైన్యం, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు. కాగా, డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా నేషనల్ ఆర్మీ (LNA) ప్రతినిధి అహ్మద్ మిస్మారీ (Ahmad Mismari) చెప్పారు. తీర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వరదల్లో మునిగిపోయాయని తెలిపారు.