గ్లాస్గో: స్కాట్ల్యాండ్లోని గ్లాస్గో నగరంలో ఇద్దరు భారతి సంతతి వ్యక్తులను బ్రిటీష్ బోర్డర్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇమ్మిగ్రేషన్ నేరాలకు పాల్పడినట్లు ఆ ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. వారిని అరెస్టు చేసేందుకు వచ్చిన బ్రిటీష్ పోలీసులకు స్థానికులు చుక్కలు చూపించారు. ఇద్దర్ని అరెస్టు చేసి వ్యాన్లో తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ వాహనానికి అడ్డు నిలిచారు. ఇద్దరు భారతీయులను విడిచి పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సుమారు 8 గంటల పాటు బ్రిటీష్ బోర్డర్ పోలీసుల వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో చివరకు పోలీసులు ఆ ఇద్దర్నీ వదిలిపెట్టారు. వారిపై మాత్రం ఇంకా బెయిల్ విచారణ పెండింగ్లోనే ఉన్నది.
గ్లాస్గో నగరంలోని పొల్లాక్షీల్డ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు ఇద్దర్ని అరెస్టు చేసి.. విచారణ కోసం తీసుకువెళ్లేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. నిజానికి స్కాట్ల్యాండ్ పోలీసులు వారిని అరెస్టు చేయాలి. కానీ అక్కడకు బ్రిటీష్ పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. బ్రిటన్ హోంశాఖ అనవసర సమస్యలు సృష్టిస్తున్నదని స్కాట్ల్యాండ్ మంత్రి నికోలా స్టర్జియన్ ఆరోపించారు. అయితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మంత్రి తెలిపారు.
బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో 34 ఏళ్ల లఖ్వీర్ సింగ్ ఉన్నాడు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన మద్దతును చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు రెయిడ్ మొదలుపెట్టిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. కానీ అరెస్టు సమాచారం రావడంతో.. భారీ సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడిన వారిని దేశం నుంచి తరమేస్తున్నట్లు బ్రిటన్ హోంశాఖ స్పందించింది. అక్రమాలను అడ్డుకోవాలన్న నేపథ్యంలోనే గ్లాస్గోలో ఆపరేషన్ చేపట్టినట్లు హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ తెలిపారు. హోంశాఖ చేపట్టిన చర్యల పట్ల స్థానిక సిక్కు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేయాలని ఆ సంఘం కోరింది.