వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రపంచం అణు వినాశనానికి అడుగు దూరంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒక చిన్న పొరపాటు జరిగినా, ఓ చిన్న తప్పుడు అంచనా వేసినా.. అణు విధ్వంసం జరుగుతుందని, దాని వల్ల మానవాళి ప్రమాదంలో పడుతుందని గుటెర్రస్ తెలిపారు. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించే ఎన్పీటీ సంస్థ ఉన్నత స్థాయి సమావేశంలో గుటెర్రస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఆసియా, మిడిల్ ఈస్ట్లో ఉన్న అణ్వాయుధ ఆందోళనల నేపథ్యంలో గుటెర్రస్ ఈ కామెంట్ చేశారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలతో అణ్వాయుధ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించిన పుతిన్ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన గుటెర్రస్.. ప్రస్తుతం రష్యా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ దేశమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13వేల అణ్వాయుధాలు ఉన్నాయని, ఆత్మరక్షణ పేరుతో చాలా వరకు దేశాలు అణు బాంబుల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.