వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్(PM Chris Hipkins) ఆదివారం చైనా పర్యటనకు వెళ్లారు. వాణిజ్యం, దౌత్య సంబంధాల బలోపేతం కోసం ఆ ట్రిప్ చేపట్టారు. అయితే వైమానికి దళానికి చెందిన రెండు విమానాలను ఆయన తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 757 విమానాన్ని బ్యాకప్గా ప్రధాని తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులతో ఆయన చైనా ట్రిప్కు వెళ్లారు. అయితే ముందు వెళ్లిన విమానానికి ఏదైనా సాంకేతిక సమస్య వస్తే మరో విమానాన్ని వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో బ్యాకప్ విమానాన్ని తీసుకువెళ్లారు. పిలిప్పీన్స్లోని మనీలా వరకు ఆ బ్యాకప్ విమానం వెళ్లింది.
చైనా పర్యటకు న్యూజిలాండ్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఆ రెండు దేశాల మధ్య చాలా దూరం ఉన్న కారణంగా కూడా రెండు విమానాలను తీసుకువెళ్లినట్లు భావిస్తున్నారు. బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల క్రితం నాటివని, అవి చివరి దశలో ఉన్నాయని, అయితే 2028 నుంచి 2030 మధ్య కాలంలో ఆ విమానాలను మార్చే అవకాశం ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని కార్యాలయం పేర్కొన్నది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రధాని వైఖరిని ఖండిస్తున్నాయి. ప్రధాని చర్యలు పర్యావరణ సమస్యలకు దారి తీస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.