కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో పరిస్థితులు కుదుటపడేలా కనిపించడం లేదు. గురువారం కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రణిల్ విక్రమ సింఘే పైనా ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రణిల్ గో హోమ్’ అంటూ కొత్తగా నిరసలు ప్రారంభించారు. శనివారం ఆ దేశ రాజధాని కొలంబోలో ప్రధానమంత్రి ఇంటికి ఎదురుగా ‘రణిల్ గో హోమ్’ పేరుతో కొత్త నిరసన వేదిక ఏర్పాటు చేశారు. కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే, రాజపక్సే కుటుంబానికి చాలా సన్నిహితుడని, వారికి మంచి స్నేహితుడని ఆరోపించారు. దీంతో కొత్త ప్రధాని రణిల్ ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం తమకు లేదని నిరసనకారులు విమర్శించారు. ‘రణిల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తున్నది. ఈ నెల 9న జరిగిన హింసాత్మక ఘటనలపై మహిందతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై దాడులు చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.