Nepal Floods : హిమాలయ దేశమైన నేపాల్ (Nepal) లో ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు (Nepal-Tibet Boarder) సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. అప్పటి నుంచి అక్కడ రక్షణ చర్యలు (Rescue Operations) కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు (Dead Bodies) బయటపడుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య (Death Toll) 1344కు చేరింది.
ఈ విషాదంపై నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ వరదల ప్రభావం 32,933 మంది ప్రజలపై పడింది. విద్య, వైద్యం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థల భవనాలు ధ్వంసం కావడంతో 6,500 మందికి పైగా విద్యార్థుల చదువు అర్ధాంతరంగా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా నేలమట్టం కాగా.. మరో మూడు కేంద్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాంతో బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించడం సవాలుగా మారింది.
సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లోని 37 మోటారు వంతెనలు, స్థానిక రాకపోకలకు ఆధారమైన 68 వేలాడే వంతెనలు తుడిచిపెట్టుకుపోయాయి. దీనివల్ల పలు మారుమూల గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. నష్టంపై సమగ్ర అధ్యయనం ఇంకా కొనసాగుతోందని, పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.