Nepal floods : నేపాల్లో వరద మృతుల సంఖ్య 900 దాటిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గల్లంతైన వారి సంఖ్య 4,000 మందిపైనే ఉంటుందని అంచనా. ఇందులో 320 మంది విదేశీయుల అచూకీ కూడా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్కు చెందిన ద నేషనల్ డిజాస్టర్ రిస్క్ రెడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎంఏ) అధికారుల ప్రకారం అనేక ప్రాంతాల నుంచి మృతదేహాల్ని సిబ్బంది గుర్తిస్తున్నారు.
మరోవైపు నేపాల్కు ఇంకా వరద ముప్పు పొంచి ఉంది. భోటెకోసి నది ఇంకా ఉప్పొంగుతుండటంతో స్థానికుల ఫోన్లకు ఇప్పటికే అలర్ట్ మెసేజ్లు అందాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. త్రిశూలి నదిలో కూడా నీటిమట్టం పెరుగుతోంది. ఈ నదిలో వరదకు ఇప్పటికే ఒక సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. తాజా పరిణామాలపై నేపాల్ ప్రధాని బాలెంద్ర షా కీలక ప్రకటన చేశారు. దేశం ఎప్పుడూ ఊహించని, హృదయవిదారకమైన విపత్తును ఎదుర్కుంటోంది అన్నారు.
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో నదులు ఉప్పొంగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి అంశాల్లో స్పష్టత రావడం లేదన్నారు. అయినప్పటికీ ప్రజల ప్రాణాల రక్షణ కోసం అంకితభావంతో కృషి చేస్తున్నామని వివరించారు.
మరోవైపు మృతదేహాల్ని భద్రపరచడానికి, ఖననం చేయడానికి కూడా నేపాల్లో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేపాల్కు ఇండియా, చైనా వంటి దేశాలు ప్రస్తుతం సహాయం అందిస్తున్నాయి.