పాకిస్తాన్ ముస్లింలీగ్ (ఎన్) అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో ఇరువురూ భేటీ అయ్యారు. లండన్ లో వీరిద్దరూ కలుసుకున్నారు. పాకిస్తాన్లో విజయం సాధించిన తర్వాత, తదుపరి కార్యక్రమాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఇకపై ఇరువురూ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురూ కలిసి ముందుకు సాగినప్పుడల్లా అద్భుత విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ చాలా కీలకమైన కూడలిలో వుందని, దేశ పునర్నిర్మాణంలో కలిసి ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించడానికి వీలవుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
ఇంతలా కలిసి ముందుకు సాగే ముందు కొన్ని కీలక సమావేశాలు కూడా నిర్వహించాలని అనుకున్నామని, ఈ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహిస్తూ, చాలా లోతుగా చర్చలు కూడా జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల పాక్ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, వాటి నుంచి ప్రజలను గట్టెక్కించాలని పేర్కొన్నారు.