పారిస్: వందల కోట్ల ఏళ్ల క్రితం మార్స్ గ్రహంపై నదులు ప్రవహించాయి. ఆ ప్రవాహం వల్లే ఇప్పుడు ఆ గ్రహం ఇలా కనిపిస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. నాసాకు చెందిన పర్సీవరెన్స్ రోవర్ తీసిన చిత్రాలు మార్స్ గ్రహంపై నదుల పరీవాహక ప్రాంతాలను చూపించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. దీని ఆధారంగా అక్కడ ప్రాచీన జీవనానికి చెందిన ఆధారాలు దొరకుతాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరిలో జెజిరో లోయల్లో పర్సీవరెన్స్ రోవర్ దిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో బిలియన్ల ఏళ్ల క్రితం ఓ నది ప్రవాహించినట్లు అనుమానించారు. దాని వల్ల అక్కడ ఫ్యాన్ ఆకారంలో ఉన్న డెల్టా ప్రాంతం ఏర్పడినట్లు భావిస్తున్నారు. పర్సీవరెన్స్లోని హై రెజల్యూషన్ కెమెరాలు తీసిన ఫోటోలను శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. ఒకప్పుడు అక్కడే నదీ పరీవాహక ప్రాంతం ఉన్నట్లు గుర్తించారు. కొండ లోయల్లో ఉన్న చారికల ఆధారంగా అక్కడ నీరు ప్రవహించినట్లు అంచనా వేస్తున్నారు.
నాసా ఆస్ట్రోబయోలాజిస్ట్ ఆమీ విలియమ్స్, ఫ్లోరిడాలోని ఆమె బృందం.. మార్స్ కొండల్లో ఉన్న లక్షణాలను.. భూమిపై నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న లక్షణాలను స్టడీ చేసింది. దిగువ ప్రాంతంలో ఉన్న మూడు చారలను పరిశీలిస్తే, అక్కడ ఒకప్పుడు నీరు ఉదృతంగా ప్రవహించినట్లు స్పష్టం అవుతోంది. అంటే సుమారు 3.7 బిలియన్ల ఏళ్ల క్రితం మార్స్ గ్రహం జీవానికి అనుకూలంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. లోయ ప్రాంతాల్లో ఉన్న కొన్ని రాళ్లు అక్కడ నీటి ఉదృతికి ఆనవాళ్లు అని కూడా చెప్పారు. రోవర్ పంపిన ఇమేజ్ల ఆధారంగా నీటి వల్ల డెల్టా ఏర్పడినట్లు భావిస్తున్నామని ఓ ప్రకటనలో విలియమ్స్ తెలిపారు.