న్యూయార్క్, మార్చి 5: మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ హవాయి దీవుల్లోని కవాయి ద్వీపంలో రహస్య బంకర్ నిర్మిస్తున్నారట. దీనికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ బంకర్ నిర్మాణం విషయాన్ని ఆయన చాలా రహస్యంగా ఉంచుతున్నారు. 2014 నుంచి ఈ దీవిలో పలు దఫాలుగా జుకర్బర్గ్ భూమి కొనుగోలు చేసి 1,400 ఎకరాలలో భారీ ఎస్టేట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోనే ఇప్పుడు బంకర్ నిర్మిస్తున్నారు.
మార్క్ జుకర్బర్గ్ మాత్రమే కాదు బిలియనీర్లు చాలామంది ఇప్పుడు దీవుల్లో ఎస్టేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్టేట్లలోనే సకల సౌకర్యాలతో బంకర్లు, రహస్య ప్రదేశాలను నిర్మించుకుంటున్నారట. బిల్ గేట్స్, ఓప్ర విన్ఫ్రే, రిచర్డ్ బ్రాన్సన్, లార్రీ పేజ్, జెఫ్ బేజోస్, మార్క్ బెనియాఫ్ వంటి కుబేరులు ఇప్పటికే వేర్వేరు దీవుల్లో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. వీటిల్లోనే బంకర్లు ఉన్నాయనే ప్రచారం ఉన్నది. మారుమూల దీవులే సేఫ్ అసలు ధనవంతులంతా ఎందుకు ఇప్పుడు బంకర్లు కట్టుకుంటున్నారు ? అంత అవసరం ఏమొచ్చింది ? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రకృతి విపత్తు తలెత్తినా, యుద్ధ పరిస్థితులు వచ్చినా సురక్షితంగా ఉండేందుకు ముందుచూపుతో బంకర్లను నిర్మించుకుంటున్నారనే మాట ప్రధానంగా వినిపిస్తున్నది. స్టేటస్ సింబల్గా కూడా బంకర్లు నిర్మిస్తున్నారనే మాట కూడా ఉంది. అయితే, బంకర్ల నిర్మాణానికి బిలియనీర్లు ఎక్కువగా మారుమూల ద్వీపాలనే ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండటం, నిరసనలు, అల్లర్లు, యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని సురక్షిత ప్రాంతాలుగా బిలియనీర్లు భావిస్తున్నారు.