ఒంటారియో: నలభై ఏండ్ల క్రితం ఐస్లాండ్ జలాల్లో పట్టుబడి అప్పటి నుంచి మెరైన్ లాండ్ థీమ్ పార్క్లోని ఓ నీళ్ల ట్యాంకులో జీవనం గడుపుతున్న కిస్కా తిమింగలం ఇకలేదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడంతో 47 ఏళ్ల ఆ తిమింగలం ఇటీవల మరణిచింది. ఈ కిస్కా వేల్ ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యధిక కాలం ఒంటరి జీవనం గడిపిన తిమింగలంగా ఇది చరిత్రలో నిలిచింది. విశాలమైన సముద్ర జలాల్లో విహరించాల్సిన ఈ తిమింగలం దాదాపు 40 ఏళ్లుగా కాంక్రీట్ నీళ్ల ట్యాంకులో జీవనం గడిపింది.
కిస్కా తిమింగలం 1979లో తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఐస్లాండిక్ జలాల్లో పట్టుబడింది. నాడు కైకో అనే తిమింగలంతోపాటు ఇది దొరికింది. అనంతరం ఆ రెండు తిమింగలాలను కెనడా దేశం, ఒంటారియో నగరంలోని నయాగరా జలపాతంలోగల మెరైన్లాండ్ థీమ్ పార్క్కు అమ్మేశారు. అక్కడ నిర్మించిన ఒక కాంక్రీట్ వాటర్ ట్యాంకులో వాటిని వదిలారు. 1980లలో కైకో, కిస్కా కలిసి ఒకే ట్యాంకులో జీవించాయి. కానీ, గత 12 ఏళ్లుగా మాత్రం కిస్కా ఒక్కతే ఒంటరిగా బతికింది.
ఈ తిమింగలాన్ని విశాలంగా ఉన్న చోటుకు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి కిస్కా మరణించింది. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి జీవనం గడిపిన తిమింగలంగా కిస్కాకు ముద్రపడింది. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కా రకం వేల్స్ ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాగా, ‘కిస్కా మృతిపట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’ అని యానిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ చెప్పారు.