న్యూయార్క్: అమెరికా జర్నలిస్టు క్రిస్టినా అమన్పోర్కు చేదు అనుభవం ఎదురైంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసితో జరగాల్సిన ఇంటర్వ్యూ అర్ధాంతరంగా రద్దు అయ్యింది. అమన్పోర్ తన తలకు స్కార్ఫ్ ధరించలేదని .. ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసి నిరాకరించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన రైసిని అమన్పోర్ ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న పరిస్థితుల కారణంగా.. హెడ్స్కార్ఫ్ ధరించని మహిళతో ఇంటర్వ్యూ చేయలేమని రైసి ప్రతినిధి చెప్పినట్లు అమన్పోర్ వెల్లడించారు. ఇరాన్ బయట జరిగిన ఇంటర్వ్యూలకు గతంలో ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా ఇలాంటి నిబంధన విధించలేదని ఆమె గుర్తు చేశారు. తాము న్యూయార్క్లో ఉన్నామని, ఇక్కడ హెడ్స్కార్ఫ్ ధరించే సంప్రదాయం లేదని అమన్పోర్ తన ట్విట్టర్లో తెలిపారు. రైసి ఇంటర్వ్యూకు రాకపోవడంతో.. ఖాళీ కుర్చీ ముందు కూర్చున్న ఫోటోను అమన్పోర్ తన ట్వీట్లో పోస్టు చేసింది.
ఇటీవల ఇరాన్లో హిజాబ్ వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మహసా అమిని అనే 22 ఏళ్ల మహిళను పోలీసులు కొట్టారు. అయితే ఆ మహిళ గత వారం చనిపోయింది. దీంతో ఏడు రోజుల నుంచి ఇరాన్లో నిరసన ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. పోలీసులు తమ చేతిలో ఉన్న బాటన్తో అమిని తలను పదేపదే కొట్టారని, ఓ వాహనానికి ఆమె తలను బాదినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వివిధ నగరాల్లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు.