టోక్యో: ఉక్రెయిన్లోని బుచాలో ఊచకోతకు పాల్పడిన సైనికులను రష్యా అధ్యక్షుడు గౌరవించడంపై జపాన్ న్యూస్ టీవీ యాంకర్ కన్నీటి పర్యంతమైంది. పుతిన్ చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వార్తను మాట్సువో అనే యాంకర్ చదివింది. రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లోని బుచా నగరంలోని వీధుల్లో పడి ఉన్న మృతదేహాలు, సామూహిక ఖననాలను గుర్తు చేసుకుని దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఈ దారుణాలకు పాల్పడిన రష్యా సైనికులను హీరోలుగా, ధైర్యవంతులుగా పుతిన్ ప్రశంసించడాన్ని తట్టుకోలేకపోయింది. అక్కడ ఇంకా చాలా మంది పౌరులు బంకర్లలో చిక్కుకుని ఉన్నారంటూ ఆ యాంకర్ కన్నీటి పర్యంతమైంది. ఉద్వేగాన్ని ఆపుకోలేక వార్త చదవడం ఆపి మౌనంగా తలదించుకుంది. క్షమించాలని వీక్షకులను కోరింది. కొన్ని క్షణాల తర్వాత బలంగా ఊపిరి పీల్చుకుని ఆవేదనను దిగమింగుకుని వార్తలు చదవడాన్ని కొనసాగించింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుచా నగరంలోని పరిస్థితులపై ఆ టీవీ యాంకర్ ఆవేదన చెందిన తీరును కొందరు కొనియాడారు. బుచాలోని దారుణాల గురించి తెలుసుకున్న తాము కూడా ఆ యాంకర్ మాదిరిగానే కలత చెందినట్లు పలువురు పేర్కొన్నారు.