రోమ్: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంత దేశాల్లో కొత్త రకం కరోనా వేరియంట్ B.1.1.529 కలకలం రేపుతున్నది. దాంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరిపోయింది. గడిచిన 15 రోజుల వ్యవధిలో ఏ ఒక్కరోజైనా ఆఫ్రికా దక్షిణప్రాంత దేశాల్లో ఉన్న వారిని తమ దేశానికి అనుమతించబోమని ఇటలీ ఇవాళ ప్రకటించింది. దక్షిణాఫ్రికా, లెసోతో, బోట్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, నమీబియా, స్వాజీలాండ్ దేశాలకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.
కొత్త రకం B.1.1.529 కరోనా వేరియంట్పై శాస్త్రవేత్తలు అధ్యయనం జరుపుతున్నారని ఇటలీ ఆరోగ్యశాఖ మంత్రి రోబెర్టో స్పెరాంజా చెప్పారు. వేరియంట్ విస్తృతిని అనుసరించి తాము సరైన సమయంలో మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, బ్రిటన్, జర్మనీ దేశాలు ఇప్పటికే ఆఫ్రికా దక్షిణ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించాయి. బ్రిటన్ గురువారమే ఈ మేరకు ప్రకటన చేయగా, జర్మనీ ఈ ఉదయం ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. తాజాగా ఇటలీ కూడా ఆ జాబితాలో చేరింది.