న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తోపాటు సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ సోమవారం భారీ స్థాయిలో క్షిపణుల వర్షం కురిపించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని పెటా టిక్వాతోసహా పలుచోట్ల ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. దీంతో అనేక ప్రదేశాలు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ అగ్నిమాపక, సహాయక విభాగం పేర్కొన్నది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరికి చికిత్స అందచేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ క్షిపణులను సైన్యం అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన ఉత్తర భాగంలోని హైఫా నగరంలోని ఓ నివాస భవనంపై ఇరాన్ క్షిపణి దాడి చేయగా ఇద్దరు మరణించారు.
ఈ ఘటన తర్వాత గల్లంతైన మరో ఇద్దరి కోసం ఇజ్రాయెల్ అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద గాలిస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఓ ఏడంతస్తుల భవనంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడితో భవనం పాక్షికంగా కూలిపోయింది. ఈ దాడిలో ఓ 10 నెలల శిశువుతోసహా నలుగురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఓ 82 ఏండ్ల వృద్ధుడు కూడా విషమ పరిస్థితిలో ఉన్నట్లు ఇజ్రాయెల్ అత్యవసర సర్వీసు మేజెన్ డేవిడ్ ఆడమ్(ఎండీఏ) తెలిపింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది.
కువైట్, యూఏఐపై కూడా ఇరాన్ క్షిపణుల దాడులు సోమవారం కొనసాగాయి. అడ్డుకున్న క్షిపణి శకలాలు మీదపడి అబూ దాబిలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలో ఓ వ్యక్తి గాయపడినట్లు యూఏఈ అధికారులు సోమవారం తెలిపారు. ముసాఫా ప్రాంతంలోని ఐసీఏడీ(ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ అబూ దాబి)లో ఉన్న రనీన్ సిస్టమ్స్ కంపెనీపై పడిన క్షిపణి శకలాలకు ఓ వ్యక్తి గాయపడగా అతడిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘనా దేశానికి చెందిన పౌరుడికి గాయాలు అయినట్లు వారు చెప్పారు.