సింగపూర్: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ ఆక్సిజన్ కొరతను అరికట్టడం కోసం ప్రభుత్వాలు కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. మరికొన్ని చోట్ల నైట్రోజన్ ప్లాంట్లను కూడా ఆక్సిజన్ ప్లాంట్లుగా మార్చి ఆస్పత్రులకు కావాల్సినంత ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నారు.
అదేవిధంగా బయటి దేశాలు కూడా ఈ ఆపత్కాలంలో భారత్కు తమవంతు సాయం అందిస్తున్నాయి. రోడ్డు, వాయు మార్గాలతోపాటు జలమార్గంలో కూడా ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ భారత్కు చేరుతున్నది. కరోనాపై పోరాటం కోసం ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్రసేతు-2 చేపట్టింది. అందులో భాగంగా విదేశాల నుంచి వైద్య సామాగ్రిని భారత్కు చేరవేస్తున్నది.
ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగానే ఇవాళ యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వ సింగపూర్కు చేరుకున్నది. ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, ఇతర వైద్య సామాగ్రితో ఆ నౌక భారత్కు తిరుగు పయనం అవుతుందని సింగపూర్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారత్లో కరోనా మహమ్మారి కట్టడి కోసం జరుగుతున్న పోరాటంలో తమవంతు ఇకపై కొనసాగుతుందని ఇండియన్ హై కమిషన్ తెలిపింది.