న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల ఫైనల్ మ్యాచ్ సమయంలో.. భారతీయ వ్యక్తి సయక్ ముకోపాధ్యాయ(Sayak Mukhopadhyay) నిరసన వ్యక్తం చేశాడు. అతనితో పాటు మరో ముగ్గురు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఫైనల్ జరిగిన ఆర్దర్ ఆషే స్టేడియంలో ఆ నలుగురూ ఆందోళన చేపట్టారు. దీని వల్ల మ్యాచ్ను దాదాపు 50 నిమిషాల పాటు ఆపేశారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న వాళ్లు అరవడం ప్రారంభించడంతో మ్యాచ్ను నిలిపేశారు. అమెరికన్ ప్లేయర్ కోకో గాఫ్, చెక్ స్టార్ కరోలినా ముచోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఆ నలుగురూ ఆందోళన చేపట్టారు. ఎక్స్టిన్క్షన్ రెబెలియన్ గ్రూపుకు చెందిన వాళ్లు.. క్లయిమెట్ ఛేంజ్ గురించి నినాదాలు చేశారు. నో టెన్నిస్ ఆన్ డెడ్ ప్లానెట్, ఎండ్ ఫాజిల్ ఫ్యుయల్స్ అంటూ అరిచారు. ఓ దశలో షూ విప్పేసిన ముకోపాధ్యాయ.. స్టేడియం కుర్చీలపై పాదరక్షలు లేకుండానే నిరసన చేపట్టారు. ముకోపాధ్యాయపై పోలీసులు కేసు బుక్ చేశారు. న్యూయార్క్ ఎమర్జెన్సీ శాఖ అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నది. అయితే కోర్టు ముందు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చి ఆయన్ను రిలీజ్ చేశారు.
25 ఏళ్ల క్రితమే కోల్కతా నుంచి న్యూయార్క్కు ముకోపాధ్యాయ తరలివెళ్లారు. అయితే వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలు ఎటువంటి షరతుకు కట్టుబడి ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న ఉద్గరాల వల్ల భారతీయ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముకోపాధ్యాయ ఆరోపించారు. వాతావరణ మార్పులపై అవగాహన, చైతన్యం కల్పించే ఉద్దేశంతో టెన్నిస్ మ్యాచ్ను అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఫైనల్లో గెలిచిన గాఫ్.. తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్నది.