న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ ఈ నెల చివర వరకు దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి(United Nations) వెల్లడించింది. ఈ నెల చివరి నాటికి ఇండియా జనాభా(India Population) 1.425 బిలియన్లు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. అయితే 2064 నాటికి భారతీయ జనాభా ఓ స్థిరత్వానికి వస్తుందని, ఇక ఈ శతాబ్ధం చివరినాటికి భారత్ జనాభా 1.5 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచిపోతుందని యూఎన్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ చివరి నాటికి చైనాను ఇండియా దాటేస్తుందని, 2022లో చైనా జనాభా 1.4 బిలియన్కు చేరుకుందని, ఆ తర్వాత తగ్గుదల ప్రారంభమైనట్లు యూఎన్ పాపులేషన్ డివిజన్ డైరెక్టర్ జాన్స్ విల్మోత్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
ఇక ఈ శతాబ్ధం చివరి నాటికి చైనా జనాభా ఒక బిలియన్ లోపు ఉండిపోతుందని విల్మోత్ చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా ఇండియాలో మాత్రం జనాభా కొన్ని దశాబ్ధాల పాటు పెరుగుతూ పోతుందని యూఎన్ అధికారి అంచనా వేశారు. ఇండియాలో జనాభా పెరుగుదల 2064 వరకు ఉంటుందని, ఆ తర్వాత వేగం మందగిస్తుందని మరో ఐక్యరాజ్యసమితి ఆఫీసర్ సారా హెర్టోగ్ తెలిపారు.
ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటినట్లు ఇటీవల యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తన రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే చైనాను మాత్రం ఇండియా ఈనెల చివరి వరకు దాటే అవకాశం ఉన్నట్లు ఆ రిపోర్టులో యూఎన్ తెలిపింది. ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుపై ప్రశ్న వేయగా.. రెండు ఏజెన్సీల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం దురదృష్టకరమని విల్మోత్ అన్నారు. ఏదేమైనా ఈ ఏడాదిలోనే చైనా పాపులేషన్ను ఇండియా దాటేస్తుందని ఆయన అన్నారు. కచ్చితంగా ఆ జనాభాను ఎప్పుడు దాటుతుందో చెప్పలేమన్నారు.
ఇండియాలో కోవిడ్ వల్ల 2021 జనాభా లెక్కల సేకరణ జరగలేదని, దాన్ని 2024లో నిర్వహించనున్నారు. కానీ చైనాలో మాత్రం 2020 నవంబర్ వరకు జనాభా లెక్కల సేకరణ జరిగిపోయిందని, అందుకే జనాభా పెరుగుదలపై అంచనా స్పష్టంగా వేయలేకపోతున్నామని విల్మోత్ తెలిపారు. అయితే ఇండియా జనాభా లెక్కల రిపోర్టు వచ్చిన తర్వాత డేటాను అప్డేట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.