పాకిస్తాన్లో జాతీయ అసెంబ్లీ రద్దైంది. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని ఇమ్రాన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన 30 నిమిషాల్లోనే రాష్ట్రపతి జాతీయ అసెంబ్లీని రద్దు చేసేశారు. 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇమ్రాన్పై విమర్శలు చేశాయి. సుప్రీం మెట్లు కూడా ఎక్కాయి. ఇవన్నీ ఒక ఎత్తు… విపక్ష నేత షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఇమ్రాన్ని అష్టదిగ్బంధం చేసి, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహం వేశాయి. అవిశ్వాసం నుంచి తప్పించుకోడానికి ఇమ్రాన్ ఓ ట్రంప్ కార్డు వేశారు. దీంతో విపక్ష వ్యూహం చిత్తైంది. ఎలాగైనా ఇమ్రాన్ను ఇరికించాలని ప్రతిపక్షం యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇమ్రాన్ ఓడిపోతే.. ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే విపక్షం ప్లాన్ వేసింది. మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్కు ఎలాగైతే శిక్ష పడిందో.. అలాగే ఇమ్రాన్కు పడేలా వ్యూహం వేస్తున్నారు.
అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషార్రఫ్ పై దేశ ద్రోహం కేసు మోపింది. అంతేకాకుండా మరణ శిక్ష కూడా విధించింది. దీంతో ముషార్రఫ్ పాకిస్తాన్కు దూరంగా ఇప్పటికీ దుబాయ్లోనే ఉండిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 1999 లో పాక్ ఆర్మీ చీఫ్గా ముషార్రఫ్ ఉన్నారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోశారు. అంతేకాకుండా నవాజ్ షరీఫ్ను గృహ నిర్బంధంలో ఉంచి, ఆపై జైలు శిక్ష కూడా విధించారు. దీని తర్వాతే ముషార్రఫ్ పాక్ అధ్యక్షుడయ్యారు. 2008 వరకూ అధ్యక్షుడిగా కొనసాగారు. దీని తర్వాత ముషార్రఫ్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. తనకు వ్యతిరేకంగా రోజు రోజుకీ నిరసనలు పెరగడంతో ముషార్రఫ్ ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి, అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కూడా బర్తరఫ్ చేసేశారు. 2008 లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పీపీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముషార్రఫ్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఇక 2013 లో జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ అధికారంలోకి వచ్చింది. నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అయ్యారు. ప్రధాని అయిన వెంటనే రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, దేశ ద్రోహం కేసు ముషార్రఫ్పై పెట్టారు. దీంతో ముషార్రఫ్ దుబాయ్ వెళ్లిపోయారు. 2016 లో ముషార్రఫ్ దుబాయ్ వెళ్లిపోతే.. ఇప్పటి వరకూ పాక్ మొహమే చూడలేదు. అయినా… ఆయనపై ఇంకా కేసులు నడుస్తూనే వున్నాయి.