డొమినికా: ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం తర్వాత దేశం వదిలిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తాజాగా డొమినికా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అందులో అతను చెప్పడం గమనార్హం. అమెరికాలో చికిత్స కోసమే తాను ఇండియా విడిచిపెట్టానని చెప్పాడు. విచారణలో భాగంగా అధికారులు వచ్చి తనను ప్రశ్నించవచ్చని కూడా తాను చెప్పినట్లు చోక్సీ అఫిడవిట్లో తెలిపాడు. నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఇండియా వదిలిపెట్టిన సమయంలో నాపై ఎలాంటి వారెంట్ లేదు అని చోక్సీ అన్నాడు.
చోక్సీని ఇండియాకు అప్పగించే అంశంపై డొమినికా హైకోర్టు విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి చోక్సీ 8 పేజీల అఫిడవిట్ను దాఖలు చేశాడు. 2018, జనవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడే కంటే కొన్ని వారాలకు ముందే తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి దేశం వదిలి పారిపోయాడు చోక్సీ. ఈ బ్యాంకు అధికారులకు లంచాలు ఇచ్చి వారి నుంచి హామీ పత్రాలు పొంది విదేశీ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నట్లు ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు చోక్సీని తీసుకురావడానికి డొమినికా వెళ్లిన భారత అధికారులు ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు. డొమినికా కోర్టు విచారణను వాయిదా వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లు తిరిగి రావాల్సి వచ్చింది. వారం రోజుల పాటు అధికారుల బృందం డొమినికాలోనే ఉంది.