న్యూఢిల్లీ : ఉగాండాలో హిప్పో రెండేండ్ల బాలుడిని మింగేసి ఆపై బయటకు సజీవంగా ఊయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హిప్పో బారి నుంచి బాలుడు పాల్ ఇగ క్షేమంగా బయటపడి స్ధానిక క్లినిక్లో కోలుకుంటున్నాడు. కత్వే కబటొరొ తీర ప్రాంతంలోని ఎడ్వర్డ్ సరస్సుకు 800 గజాల దూరంలోని తన ఇంటిలో రెండేండ్ల బాలుడు పాల్ ఆడుకుంటుండగా అనూహ్యంగా అక్కడికి వచ్చిన హిప్పో బాలుడిని నోట కరుచుకుంది.
బాలుడిని అది మింగుతుండగా అటుగా వెళుతున్న వ్యక్తి కంటపడటంతో అతడు జంతువుపైకి రాళ్లు విసిరాడు. దీంతో భయపడిన హిప్పో బాలుడిని బయటకు విసిరింది. బాలుడిని కాపాడిన వ్యక్తిని క్రిస్పస్ బగంజాగా గుర్తించారని ది టెలిగ్రాఫ్ తెలిపింది. సరస్సు నుంచి బయటకు వచ్చిన హిప్పో బాలుడిపై దాడి చేసిన ఘటన ఇదే తొలిసారని ఉగాండా పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బాలుడిని నోట కరుచుకున్న హిప్పో అతడి శరీరం సగాన్ని మింగేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న క్రిస్పస్ తక్షణమే స్పందించి జంతువుపై రాళ్లు వేయడంతో భయపడిన హిప్పో బాలుడిని తన నోటి నుంచి జారవిడిచిందని తెలిపారు. ఆపై బాలుడిని ఆస్పత్రికి తరలించి ముందుజాగ్రత్తగా రేబిస్ వ్యాక్సిన్ వేసి డిశ్చార్జి చేశారని పోలీసులు వెల్లడించారు. ఇక క్రిస్పస్ రాళ్లు విసరడంతో బెంబేలెత్తిన హిప్పో తిరిగి సరస్సులోకి వెళ్లింది.