బాల్టిమోర్: అమెరికా డాక్టర్లు చరిత్ర సృష్టించారు. విజయవంతంగా పంది గెండెను మనిషికి మార్పిడి చేశారు. జన్యుమార్పిడి చేసిన పది గుండెను.. ఓ హృద్రోగి పేషెంట్కు ట్రాన్స్ప్లాంట్ చేశారు. మేరీల్యాండ్కు చెందిన డేవిడ్ బెన్నెట్కు ఈ సర్జరీ చేశారు. పంది గుండెను మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. సుమారు 8 గంటల పాటు సర్జరీ జరిగింది. మేరీల్యాండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ డాక్టర్లు ఈ శస్త్ర చికిత్స చేశారు. పేషెంట్ వయసు 57 ఏళ్లు. అయితే ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీతో వైద్య రంగంలో పెను మార్పులను తీసుకువస్తుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. అవయవ మార్పిడిలో ఇదో కొత్త అధ్యాయం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. వేలాది మంది రోగులకు అవసరమైన అవయవ మార్పిడి చికిత్సలకు ఈ సర్జరీ కీలకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. బెన్నెట్కు పంది గుండెను అమర్చిన తర్వాత.. అది పల్స్ను, ప్రెజర్ను క్రియేట్ చేస్తోందని డాక్టర్ బార్ట్లే గ్రిఫిత్ తెలిపారు. ప్రస్తుతం బెన్నెట్ గుండె నార్మల్గా పనిచేస్తోందన్నారు.
అమెరికాలో గత ఏడాది 42 వేల మందికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. దాంట్లో సగం కన్నా ఎక్కువ కేసులు కిడ్నీ మార్పిడివే. అయినా అమెరికా డాక్టర్ల ప్రకారం.. అవయవాల కొరత ఉంది. ప్రతి రోజూ డజన్ల సంఖ్యలో అవయవ మార్పిడి జాబితాలో రోగులు చేరుతున్నారు. గత ఏడాది సుమారు 3817 మందికి గుండె మార్పిడి సర్జరీలు చేశారు. అయితే వారంతా మరో మనిషి గుండెను డోనార్ రూపంలో తీసుకున్నారు. అయినా అమెరికాలో గుండె చికిత్సలకు డిమాండ్ పెరుగుతోంది. పంది గుండెను మార్పిడి చేసిన బెన్నెట్ ఇంకా హార్ట్-లంగ్ బైపాస్ మెషీన్కు కనెక్ట్ అయి ఉన్నాడు. సర్జరీ తర్వాత 48 గంటల పాటు అతన్ని అబ్జర్వేషన్లో పెట్టారు. కొత్త గుండె సరైన రీతిలోనే ఫంక్షన్ చేస్తోందని, మరికొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు.
జీన్ ఎడిటింగ్, క్లోనింగ్ విధానంలో పంది గుండెను అభివృద్ధి చేశారు. రీజనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ ఆ జన్యు మార్పిడి పందిని పేషెంట్కు డొనేట్ చేసింది. పందిలో పది రకాల జన్యుమార్పిడిలు జరిగినట్లు వైద్యులు తెలిపారు. జీన్ ఎడిటింగ్ ద్వారా.. ఆ పందిలో నాలుగు జన్యువులను ఇన్యాక్టివేట్ చేశారు. మానవ స్పందనలను నిరాకరించే జన్యువులను డీకోడ్ చేశారు. అయితే ఇంప్లాంట్ చేసిన తర్వాత పంది గుండె పెరగకుండా ఉండేందుకు గ్రోత్ జన్యువును కూడా ఇన్యాక్టివేట్ చేసినట్లు డాక్టర్ మోహిద్దీన్ తెలిపారు. పంది అవయవాలు మనుషులకు సరిపడే విధంగా ఉండేందుకు.. డోనార్ పందికి సుమారు ఆరు మానవ జన్యువులను క్లోనింగ్ ద్వారా ఎక్కించారు.