న్యూయార్క్, జూలై 16: టైటానిక్! ఆధునిక మానవజాతి చరిత్ర మరువలేని విషాదం. నీటమునిగి వందేండ్లు గడిచినా ఇప్పటికీ ప్రపంచం నోట్లో నానుతున్న పేరు. ఈ ప్రమాదంపై నేటికీ అంతుచిక్కని ప్రశ్నలెన్నో. వీటికి సమాధానాలు కనుగొనేందుకూ ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్ఎంఎస్ టైటానిక్ అనే సంస్థ ఈ ప్రయత్నాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నది. సముద్రగర్భంలో చిక్కుకున్న టైటానిక్ వద్దకు సాహసయాత్ర చేపట్టనున్నది. టైటానిక్కు సంబంధించిన మరింత సమాచారాన్ని రానున్న తరాలకు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం టైటానిక్ వద్దకు ఓ బృందం బయలుదేరుతున్నది. గత ఏడాది జూన్ 18న టైటానిక్ను చూసేందుకు ఐదుగురు సభ్యుల బృందంతో వెళ్లిన ఓషియన్గేట్ టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం జరిగిన తర్వాత టైటానిక్ వద్దకు వెళ్లేందుకు జరుగుతున్న మొదటి ప్రయత్నం ఇదే కావడం విశేషం.
ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు 2,224 మందితో బయల్దేరిన టైటానిక్ నౌక 1912 ఏప్రిల్ 14న ప్రమాదానికి గురయ్యింది. ఓ మంచుకొండను ఢీకొన్న ఈ భారీ నౌక సముద్రగర్భంలో మునిగిపోయింది. దీని జాడ గుర్తించడానికే 73 ఏండ్లు పట్టింది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, కెనెడాలోని న్యూఫౌండ్లాండ్ తీరంలో 3,800 అడుగుల లోతులో టైటానిక్ ఉన్నట్టు 1985 సెప్టెంబరు 1న గుర్తించారు. అప్పటినుంచి టైటానిక్ను ఒకసారి చూడాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నది. ఇప్పటివరకు దాదాపు 250 మంది మాత్రమే టైటానిక్ను చూడగలిగారు.
టైటానిక్ పట్ల జనంలో ఉన్న ఆసక్తిని గుర్తించిన ఓషియన్గేట్ అనే కంపెనీ.. టైటానిక్ యాత్రకు శ్రీకారం చుట్టింది. టైటాన్ అనే సబ్మెర్సిబుల్లో ఐదుగురిని టైటానిక్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇందులో ఒకరు ఆ కంపెనీ యజమాని స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. అయితే, ఈ యాత్ర విషాదాంతం అయ్యింది. సముద్రంలో ఇది గల్లంతయ్యింది. చాలా రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత ‘టైటాన్’ పేలిపోయిందని, ఇందులో ఉన్న వారంతా మరణించారని తేలింది. ఈ ప్రమాదం తర్వాత మొదటిసారి ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ.. టైటానిక్పై అధ్యయనం కోసం ఒక బృందాన్ని పంపిస్తున్నట్టు ప్రకటించింది.
టైటానిక్ శిథిలాలను హైరిజల్యూషన్లో ఫొటోలు తీసి టైటానిక్ చరిత్రను భావితరాలకు, శాస్త్రీయ అధ్యయనాలకు అందించాలనేది తమ లక్ష్యమని ఆర్ఎంఎస్ టైటానిక్ సంస్థ ప్రకటించింది. టైటానిక్లో ఉన్న పాడైపోతున్న కళాఖండాలను వెలికితీసేందుకు ఉన్న అవకాశాలను గుర్తిస్తామని చెప్తున్నది. టైటానిక్ వద్దకు వెళ్లనున్న బృందంలో ఆరుగురు సభ్యులు ఉండనున్నారు. వీరిలో సముద్రం లోపల ఫొటోలు తీయడంలో నిపుణుడైన తొమసిన రే, టైటానిక్పై అధ్యయనం చేస్తున్న ఎవాన్ కొవాక్స్, జేమ్స్ పెంక తదితరులు ఉన్నారు. ఈ యాత్ర కోసం రెండు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికిల్స్(ఆర్వోవీ)లను వినియోగించనున్నారు.