ఒరెమ్, సెప్టెంబర్ 11: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. ఉటా రాష్ట్రంలోని ఉటా వేలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయనను ఒక దుండగుడు కాల్చి చంపాడు. మాస్ షూటింగ్పై జరిపిన చర్చా కార్యక్రమంలోనే ఆయనను కాల్చి చంపారు. సమీప భవనం పై కప్పు నుంచి జరిపిన ఒక రౌండ్ కాల్పుల్లో చార్లీ మెడపై తీవ్ర గాయం కావడంతో ఆయనను దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. గుర్తు తెలియని ఆ షూటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనతో వారికెలాంటి సంబంధం లేదని తెలియడంతో తర్వాత వదిలిపెట్టారు.
హత్యకు గల కారణాన్ని ఇంకా నిర్ధారించ లేదు. కాగా, నిందితుడు ఒకరిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేసినట్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. కాగా, చార్లీ హంతకుడిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని ఎఫ్బీఐ విడుదల చేసింది. అతడిని పట్టిచ్చిన వారికి లక్ష డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. గతేడాది ట్రంప్పై పెన్సిల్వేనియాలో జరిగిన హత్యా యత్నం మాదిరిగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, కిర్క్ చర్చా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వెయ్యి సంతకాలతో ఒక ఆన్లైన్ పిటిషన్ అందిందని యూనివర్సిటీ నిర్వాహకులు తెలిపారు.
తన సహచరుడి మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. కిర్క్ గొప్ప వ్యక్తి అని తన సోషల్ మీడియా ట్రూత్తో తెలిపారు. ఇది కచ్చితంగా రాజకీయ హత్యేనని, అతివాద వామపక్షమే దీనికి కారణమని ఆరోపించారు. హత్యపై తీవ్ర షాక్ను వ్యక్తం చేశారు. దీనికి పాల్పడిన వారు, దానిని ప్రోత్సహించిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అమెరికా విలువలను కాపాడటానికి తన జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడిగా కిర్క్ను అభివర్ణించారు. ఇది రాష్ర్టానికి చీకటి దినం. మన జాతికి విషాదకరమైన రోజు అని ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ సం తాపం వ్యక్తం చేశారు.
కిర్క్ మొదటి నుంచి భారతీయ వ్యతిరేకిగా గుర్తింపు పొందాడు. భారతీయులకు వీసాలు ఇవ్వొద్దని ఆయన ఇటీవల ప్రచారం చేశారు. మే 8న జరిగిన ఒక పాడ్కాస్ట్లో కిర్క్ మాట్లాడుతూ భారత వలసవాదులపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ను ఆపాలని ట్రంప్ను కోరారు. బిన్ లాడెన్కు ఆశ్రయమిచ్చిన పాకిస్థాన్ మోసపూరితమైనదని, ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరు జరుపుతున్న భారత్కు యూఎస్ కొద్దిగా మద్దతు తెలపవచ్చని, కానీ అది నైతిక మద్దతు కంటే ఎక్కువ ఉండరాదని అన్నారు.