బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ ప్రజలు భయాందోళనల్లో మునిగి ఉన్నారు. శుక్రవారం నుంచి కరోనా లాక్డౌన్ను విధించనున్నారు. హోమ్ డెలివరీ కూడా నిలిచిపోనున్నది. దీంతో గురువారం నిత్యవసరాల కొనుగోలుకు ప్రజలు పోటెత్తారు. షాపుల వద్ద భారీగా బారులు తీరారు. చాయాంగ్ జిల్లాను కరోనా వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాతోపాటు రాజధాని బీజింగ్లో శుక్రవారం నుంచి మూడు రోజులు లాక్డౌన్ విధిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది. కరోనా పరీక్షకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో షాంఘై తరహా లాక్డౌన్ విధించ వచ్చన్న ప్రచారంతో బీజింగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫుడ్ డెలివరీలను నిలిపివేయబోమని బీజింగ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. లాక్డౌన్ వదంతులను ఆయన ఖండించారు. నగర కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం ఉండదని అన్నారు. అయితే ప్రజలు మూడు రోజులపాటు ఇంటి వద్దనే ఉండాలని, ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.
మరోవైపు బీజింగ్లో రోజువారీ కరోనా కేసుల నమోదు వెయ్యిలోపే ఉన్నది. అయినప్పటికీ నగరంలో కరోనా ఆంక్షలను మరింత కఠినం చేశారు. అపార్ట్మెంట్ సముదాయాలను మూసివేశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు క్యాబ్ సేవలను నిలిపివేశారు. ఫాంగ్షాన్, షునితోపాటు చాయోయాంగ్ జిల్లా దక్షిణ ప్రాంతాలపై క్యాబ్ యాప్స్లో నిషేధం విధించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఎలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు.