China | న్యూఢిల్లీ: వైద్య చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘటన. మహిళ కడుపులో రెండు గర్భాశయాలు ఉండడమే వింతైతే.. రెండింటి ద్వారానూ పిల్లల్ని కనడం మరో వింత. చైనాలో సెప్టెంబర్లో జరిగిందీ ఘటన. వాయువ్య చైనాలోని షాంగ్జి ప్రావిన్స్కు చెందిన మహిళ సెప్టెంబర్లో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బాబు, పాపకు జన్మనిచ్చింది. ఇందులో ఎలాంటి వింత లేకపోయినా.. ఆమెకు రెండు గర్భాశయాలు ఉండడం, ఒకేసారి రెండింటి ద్వారానూ ఆమె గర్భం దాల్చడం, ఒకేసారి కవలలకు జన్మనివ్వడం అత్యంత అరుదని వైద్యులు చెప్తున్నారు.
ప్రపంచంలో ఇలా 0.3 శాతం మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. ఆమెలో పుట్టుకతోనే రెండు గర్భాశయాలు ఉన్నాయని, రెండూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయని గుర్తించారు. సహజ పద్ధతిలో ఒకేసారి రెండు గర్భాశయాల ద్వారా ఆమె గర్భం దాల్చడం చాలా అరుదని, ఇప్పటి వరకు ఇలాంటివి రెండే రెండు జరిగాయని, అందులో చైనాలో ఇది మొదటిదని వివరించారు. ఎనిమిదిన్నర మాసాల గర్భంతో ఉండగా ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని, బాబు 3.3 కేజీలు, పాప 2.4 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగు రోజుల అనంతరం దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు.