పిల్లలు కనాలనుకునే జంటలకు చైనా ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఆర్థిక పరిమితుల కారణంగా పిల్లలు కనకుండా ఉండేవారికి శుభవార్త చెప్పింది. వీరికోసం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ఏఆర్టీ) ఉపయోగించే 16 రకాల మెడికల్ సేవలకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలు మార్చి 26 నుంచి చైనా రాజధాని బీజింగ్లో అమల్లోకి రానున్నాయి.
ఇప్పటికే చైనాలో జననాల రేటు రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. గతేడాది ఈ రేటు చరిత్రలో లేనంతగా తగ్గింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దేశంలో జననాల రేటును పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో సానుకూల ఫలితాలు సాధించడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకొంటామని చైనా ప్రీమియర్ లి కెకియాంగ్ చెప్పారు.
డ్రాగన్ దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ.. పని చేసే వర్క్ఫోర్స్ తగ్గిపోతోందని, ఒక విధంగా ‘డెమొగ్రాఫిక్ టైమ్బాంబ్’ ఎదుర్కొంటోందని నిపుణులు హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే జననాల సంఖ్యను పెంచేందుకు బీజింగ్ ప్రభుత్వం ఇన్సూరెన్సును ప్రకటించింది. గర్భధారణ సమయంలో అయ్యే ఖర్చులకు భయపడే తక్కువ జీతం ఉన్న కుటుంబాలు ఈ నిర్ణయం వల్ల లబ్ది పొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా జననాల రేటు పెరుగుతుందని ఆశిస్తోంది.