ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య నేపథ్యంలో భారత్-కెనడా (Canada) మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెండు దేశాల్లోనూ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్లోని తమ పౌరులకు కెనడా ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ (Travel advisory) జారీచేసింది. భారత్లోని తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని హెచ్చరించింది. కెనడా పట్ల సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, కొందరు ఆందోళనలకు పిలుపునిస్తున్న దృష్ట్యా కెనడియన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కెనడాలోని భారతీయులకు, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. కెనడాలోని ఓ భారతీయ అధికారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. ప్రతిగా ఢిల్లీలోని కెనడా రాయబారిని దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించింది. అదేవిధంగా కెనెడియన్లకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది.