Imran Khan : తమ తండ్రి, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తనయులు ఆరోపించారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కొడుకులు సులైమాన్ ఖాన్, కాసిం ఖాన్లు బ్రిటన్లో ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కొడుకులు ఇద్దరూ ఇంగ్లండ్లో ఉంటున్నారు. ఇంగ్లండ్-పాక్ మధ్య టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్.. క్రికెటర్ అనే సంగతి తెలిసిందే.
ఆయన గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ ఏథర్టన్తో ఇమ్రాన్ కొడుకులు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ తండ్రి ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన విషయాలు వెల్లడించారు. తమ తండ్రిని హత్య చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. తాము పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతివ్వకుండా ఆ దేశం తమ వీసాలను నిరాకరిస్తోందన్నారు. సాంకేతిక కారణాలు చూపి, తమను పాక్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పాకిస్తాన్ జైళ్లలో అనేక మంది రాజకీయ ఖైదీలు హతమయ్యారని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా అదే జరుగుతోందని ఆయన తనయులు గుర్తు చేశారు. ‘‘వాళ్లేం చేస్తున్నారో స్పష్టత లేదు. కానీ, ఇమ్రాన్ను చంపేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. వీలైనంత కాలం ఆయనను జైలులోనే ఉంచాలని భావిస్తున్నారు. అక్కడే ఆయనను అంతం చేయాలని చూస్తున్నారు. చివరగా ఆయనను మా కుటుంబ సభ్యులు కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయారు. జైలులో పరిస్థితులు విషమిస్తున్నాయి. జైలులో కొందరు రాజకీయ నేతల్ని చంపేసినట్లు ఆయన చెప్పారు.
ఇప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. రోజులో 23 గంటలు ఆయనను ఒక్కడినే ప్రత్యేక గదిలో ఉంచుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సరైన చికిత్స అందించడం అత్యవసరం. ఆయన కంటికి సమస్య ఉంది. సరిగ్గా చూడలేకపోతున్నారు’’ అంటూ సులైమాన్, కాసిం చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. అలా చేస్తే తాము మ్యాచ్ రద్దు చేసుకుంటామని తెలిపింది. అయినప్పటికీ, ఇంగ్లండ్ మీడియా ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయడం విశేషం.