న్యూఢిల్లీ: ఉత్తర ధృవం ఇప్పుడు భూమిని భయపెడుతోంది. గతేడాది మేలో ఆర్కిటిక్లోని అత్యంత పురాతన మంచు పలకలో ఓ భారీ గొయ్యి ఏర్పడింది. ఇది ప్రపంచాన్ని ఆందోళన కలిగించే పరిణామమే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది కాస్తా ఆ మంచు పలక విరిగిపోవడానికి కారణమై, ఆ మంచు పూర్తిగా కరిగి సముద్రాల్లో కలిస్తుందని, దీనివల్ల నీటి మట్టాలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
దీనిని పోలిన్యాగా పిలుస్తారు. ఇది 1988, 2004లోనూ కనిపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లోనూ ప్రచురించారు. కెనడాకు సమీపంలోని మంచు పలకలో ఈ భారీ గొయ్యి ఏర్పడింది. ఇది 100 కి.మీ. మేర విస్తరించింది. ఉత్తర ధృవంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి మంచు ప్రమాదంలో పడింది.
ఈ శతాబ్దం చివరిలోపు ఇక్కడి చివరి మంచు పలక కూడా పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉన్నదని, ఇది ఆర్కిటిక్, ఉత్తర ధృవాల్లో నివసిస్తున్న జీవరాశుల అంతానికి కారణమవుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. గతేడాది మేలో వచ్చిన ఓ భారీ తుఫాను కారణంగా ఈ గొయ్యి ఏర్పడినట్లు వాళ్లు చెప్పారు. ఈ గొయ్యికి సంబంధించిన ఫొటోలను శాటిలైట్ ద్వారా తీశారు. ఇది 100 కి.మీ. పొడవు, 30 కి.మీ. వెడల్పుతో ఉన్నట్లు గుర్తించారు.