ఢాకా: అవామీ లీగ్(Awami League) రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని చేపట్టింది. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకారం ఆ పార్టీ తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో 222 సీట్లు గెలుచుకున్నది. ఆ దేశంలో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. కేవలం 298 స్థానాలకు మాత్రమే ఫలితాలు ఇచ్చారు. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మరణించారు. మనో స్థానంలో పోలింగ్ను విత్హెల్డ్లో పెట్టారు. మళ్లీ షేక్ హసీనా ఆ దేశ ప్రధానిగా కొనసాగనున్నారు. అవామీ లీగ్ 222 స్థానాల్లో విజయం సాధించినట్లు చీఫ్ ఎన్నికల కమీషనర్ కాజి హబిబుల్ అవాల్ తెలిపారు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ తర్వాత ఇండిపెండెంట్లు రెండో స్థానంలో నిలిచారు. జనవరి ఏడో తేదీన ఆ దేశంలో ఎన్నికల జరిగాయి. ఆ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు 62 స్థానాల్లో విజయం సాధించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న జతియా పార్టీ కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
గత ఎన్నికల్లో అవామీ లీగ్ 258 స్థానాల్లో విజయం సాధించింది. అందరి అంచనాలకు తగినట్లు అవామీ లీగ్ నాలుగోసారి వరుసగా విక్టరీ కొట్టింది. నిజానికి ఈసారి చాలా తక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మధ్యామ్నం 3 గంటల వరకు కేవలం 27.15 శాతం పోలింగ్ మాత్రమే ఉంది. కానీ 4 గంటలకు ఓటింగ్ ముగిసే సమయానికి పోలింగ్ 40 శాతానికి పెరిగింది. అంటే గంటలోనే 13 శాతం పెరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. 2018 ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగింది.
1996లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యల్పంగా 26.5 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తాజా ఎన్నికల్లో కనీసం ముగ్గురు కేంద్ర మంత్రులు, 14 మంది అధికార పార్టీ ఎంపీలు ఓటమి పాలయ్యారు.