హైదరాబాద్: పంటల్ని నాశనం చేసే ఎలుకలు.. అడువుల్ని తినే కీటకాలు.. రోగాలను మోసుకొచ్చే దోమల వల్ల పర్యావరణానికి, మానవాళికి భారీ నష్టం జరిగినట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఆ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తేల్చారు. ఫ్రాన్స్కు చెందిన పరిశోధకులు ఓ కొత్త అధ్యయన నివేదికను ఇటీవల వెలువరించారు. పర్యావరణానికి హానిగా మారిన కొన్ని చొరబాటు జీవాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు లక్షా 30 వేల కోట్ల డాలర్ల(1.3 ట్రిలియన్ డాలర్లు) నష్టం వచ్చినట్లు పరిశోధకులు అంచనా వేశారు. 1970 నుంచి నేటి వరకు ఆ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే సగటును ప్రతి ఏడాది ఆ నష్టం సుమారు 2680 కోట్ల డాలర్లు (26.8 బిలియన్ డాలర్లు) ఉంటుందని భావిస్తున్నారు. తాము చేసిన అంచనా ఇంకా తక్కువే ఉంటుందని కూడా పరిశోధకులు తెలిపారు. ఈ నివేదికను నేచర్ జర్నల్లో ప్రచురించారు. కీటకాలు, సరీసృపాలు, పక్షులు, చేపలు, సూక్ష్మజీవులు, జంతువుల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన నివేదికను పారిస్ వర్సిటీ ఎకాలజీ శాస్త్రవేత్త క్రిష్టోఫర్ డగ్నీ రిలీజ్ చేశారు. జీవాల వల్ల ఎక్కువ శాతం పర్యావరణం, పంటలకు, మత్స్యసంపదకు నష్టం జరిగిందన్నారు. పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తున్న టాప్ టెన్ కీటకాల్లో పంటలను తినే ఎలుకలు, ఆసియా జాతి సీతాకోక చిలుకలు ఉన్నాయి. దక్షిణాసియాలో టైగర్ దోమ వల్ల భారీ నష్టం జరుగుతోంది. దీని వల్ల చికున్గునియా, డెంగ్యూ, జికా లాంటి వ్యాధులు వస్తున్నాయి. పెంపుడు పిల్లుల వల్ల పక్షులకు ఇబ్బంది తలెత్తిందన్నారు. ఫ్రాన్స్ పరిశోధకులు తమ నివేదికలో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పారు.