బ్రెసిలియా: ముగ్గురు వ్యక్తులకు నిత్యం కరోనా టెస్ట్ చేయగా 70 రోజులకుపైగా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో కరోనా సోకిన కొందరు వ్యక్తుల్లో వైరస్ ఎక్కువ రోజులపాటు యాక్టివ్గా ఉంటున్నట్లు ఈ అధ్యయంలో తేలింది. అయితే ఇవి సాధారణ కేసులు కావని, విలక్షణమైన కేసులని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా వైరస్ 14 రోజులపాటు మాత్రమే క్రియాశీలకంగా ఉంటుందన్న ప్రస్తుత వాదనకు భిన్నంగా ఉన్న కొత్త స్టడీకి సంబంధించిన నివేదికను ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు.
ఈ అధ్యయనం కోసం 38 మంది బ్రెజిలియన్ కరోనా రోగులను ఎంచుకున్నారు. నెగిటివ్గా తేలేంత వరకు వారికి నిత్యం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళకు 70 రోజులకు పైగా కరోనా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఈ మూడు విలక్షణమైన కేసులలో, మహిళలో 71 రోజులు, ఇద్దరు పురుషులలో ఒకరిలో 81 రోజులపాటు వైరస్ ఉనికిని గుర్తించారు. వారికి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఎవరికీ ఇతర అనారోగ్య సమస్యలు లేవని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.
మరోవైపు ఈ ముగ్గురిలో ఒక పురుషుడికి 232 రోజులపాటు కరోనా టెస్ట్ కొనసాగించగా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ వ్యక్తికి హెచ్ఐవీ ఉందని, అప్పటికే చికిత్స పొందుతున్నందున అతడిలో వైరల్ లోడ్ పెద్దగా లేదన్నారు. ఈ అధ్యయంలో పాల్గొన్న కరోనా రోగులంతా 2020 ప్రారంభంలో బ్రెజిల్లోకి ప్రవేశించిన బి.1.1.28 వైరియంట్ బారినపడ్డారని తెలిపారు.
మరోవైపు SARS-CoV-2 సోకిన వారిలో 8 శాతం మంది వ్యక్తులు రెండు నెలలకుపైగా వైరస్ను వ్యాప్తి చేసే అవకాశం ఉందన్నది ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నట్లు ఈ ఆర్టికల్ తొలి రచయిత మారియల్టన్ డాస్ పాసోస్ కున్హా తెలిపారు. ఇన్ఫెక్షన్ చివరి దశలో ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా వైరస్ను వ్యాప్తి చేయగలరని చెప్పారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ పీరియడ్ 14 రోజుల వ్యవధి సరిపోతుందో లేదో అన్నది అంచనా వేయడం తమ అధ్యయనం ప్రధాన లక్ష్యమన్నారు.
కాగా, ఈ విలక్షణమైన కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేయలేరని నిర్ధారించుకోవడానికి 14 రోజులు సరిపోదని రచయిత తెలిపారు. ఒక పేషెంట్ కరోనా నెగెటివ్గా ని ర్ధారణ కావడానికి ఒక నెలకుపైగా కూడా సమయం పట్టవచ్చని చెప్పారు. తమ అధ్యయనం ప్రకారం కొన్ని సందర్భాల్లో కరోనా రోగులు 71 నుండి 232 రోజుల వరకు పాజిటివ్గా గుర్తించినట్లు వివరించారు.