న్యూఢిల్లీ: సుడాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. నేవీ షిప్ ఐఎన్ఎస్ సుమేదాలో తొలి బ్యాచ్ బయలుదేరింది. ఆ యుద్ధనౌక సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తన ట్విట్టర్లో తెలిపారు. ఆపరేషన్ కావేరీ(Operation Kaveri)లో భాగంగా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తన ట్విట్టర్లో ఐఎన్ఎస్ సుమేదా ఫోటోలను పోస్టు చేశారు. తరలింపు కోసం ఏర్పాట్లు చేసిన భారత సర్కార్కు ధన్యవాదాలు చెబుతూ జాతీయ జెండాను కొందరు పట్టుకున్నారు.
పోస్టు సుడాన్ నుంచి జెడ్డాకు సుమారు 278 మంది యుద్ధ నౌక సుమేదాలో వస్తున్నట్లు బాగ్చి తెలిపారు. సుడాన్లో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడ ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య భీకర పోరు సాగుతోంది. అయితే భారతీయుల తరలింపు కోసం జెడ్డాలో ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ను కూడా రంగంలో ఉంచారు. జెడ్డా చేరుకున్న తర్వాత భారతీయుల్ని స్వదేశానికి తీసుకురానున్నారు.
First batch of stranded Indians leave Sudan under #OperationKaveri.
INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah. pic.twitter.com/4hPrPPsi1I
— Arindam Bagchi (@MEAIndia) April 25, 2023
సుడాన్లో సుమారు మూడు వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని ఖర్తూమ్తో పాటు అనేక ప్రాంతాల్లో సాయుధ దళాల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే 400 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.