వాషింగ్టన్: ఈ నెలలో 1.8 కిలోమీటర్ల వెడల్పైన ప్రమాదకర గ్రహశకలం భూమికి దగ్గరగా రానున్నది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో తిరుగుతున్న ఈ గ్రహశకలం గంటకు 47,196 కిలోమీటర్ల వేగంతో భూమికి చేరువగా వెళ్లనున్నది. ప్రస్తుతం దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ భవిష్యత్తులో ఇది ప్రమాదం కలిగించే అవకాశమున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. 1989లో పాలోమార్ అబ్జర్వేటరీలో దీనిని తొలిసారిగా గుర్తించినట్లు తెలిపింది. దీంతో 1989 జేఏగా పేరు పెట్టిన ఈ గ్రహశకలం ఈ నెల 29న భూమికి దగ్గరగా వచ్చినప్పుడు బైనాక్యులర్ ద్వారా చూడవచ్చని పేర్కొంది.
కాగా, ఈ భారీ గ్రహశకలం ఈసారి భూమికి 40,24,182 కిలోమీటర్ల సమీపం నుంచి వెళ్తుందని నాసా తెలిపింది. 1996లో 40 లక్షల కిలోమీటర్ల సమీపం నుంచి వెళ్లిన ఇది తిరిగి 2029 సెప్టెంబర్తోపాటు 2055, 2062లో భూమికి అత్యంత చేరువుగా వెళ్తుందని వెల్లడించింది.
మరోవైపు 1.3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భారీ గ్రహశకలం 138971 (2001 CB21) మార్చి 4న భూమికి 49,11,298 కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకెళ్లింది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహశకలం కేవలం 400 రోజుల్లో దాని కక్ష్యను పూర్తి చేస్తోందని నాసా పేర్కొంది.