సిటీబ్యూరో, జూన్ 20 ( నమస్తే తెలంగాణ ): యోగా.. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభ్యున్నతికి చాలా ఉపయోగపడుతుందని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. కీళ్లమార్పిడి అనంతరం యోగా చేయడానికి చాలా మంది సందేహిస్తుంటారని అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని యోగా చేస్తే నష్టమేమీ లేదని సూచించారు. సర్జరీ తర్వాత యోగా చేయడం వల్ల కండరాలు బలపడటమే కాకుండా శరీరం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో యోగాది కీలకపాత్ర అని చెప్పారు. యోగాతో మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి సుఖవంతమైన నిద్ర చేకూరుతుందని వివరించారు. ఆసనాలు చాలా రకాలుగా ఉంటాయి .. శస్త్రచికిత్స ఆధారంగా వైద్యుల సలహాలతో యోగాసనాలు చేస్తే మేలని అన్నారు. కీళ్ల మార్పిడి తరువాత జాయింట్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆసనాలలో తగు మార్పులు చేయాలని సూచించారు. మెడిటేషన్, ప్రాణాయమం కచ్చితంగా చేయాలని అన్నారు.